శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (10:43 IST)

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అధమస్థాయికి దిగజారింది... ఇర్ఫాన్ పఠాన్

irfan pathan
ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభ పోటీ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్‌లో భాగంగా, బుధవారం రాత్రి జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ముంబై జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ముంబై జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఏకంగా 277 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై జట్టు విజయానికి మరో 32 పరుగులు దూరంలో వచ్చి ఆగిపోయింది. అయితే, ఈ సీజన్‌లో ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు చేతిలో దారుణ ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యాను లక్ష్యంగా చేసుకుని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
స్టార్ బౌలర్ జస్రీత్ బుమ్రా అందుబాటులో ఉన్నప్పటికీ ఆలస్యంగా బౌలింగ్ చేయించడంపై మండిపడ్డాడు. 'సాధారణంగా ఉండే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అధమస్థాయికి దిగజారింది. ప్రత్యర్థి జట్టు అంతలా విధ్వంసం సృష్టిస్తుంటే బుమ్రాను సకాలంలో బౌలింగ్ వేయించకుండా దూరంగా ఉంచడం ఏంటో నాకైతే అర్థం కాలేదు' అని ఎక్స్ వేదికగా పఠాన్ విమర్శించాడు. ఇక ఐపీఎల్లో రికార్డు స్కోరు సాధిస్తుందని భావించిన ముంబై ఇండియన్స్ జట్టుపైనే రికార్డు స్కోరు నమోదవుతుందని ఎవరు ఊహిస్తారని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. 
 
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చితక్కొట్టిందని మెచ్చుకున్నాడు. హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ తీరుపై కూడా ఇర్ఫాన్ పఠాన్ విరుచుకుపడ్డాడు. టీమ్ మొత్తం 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటే కెప్టెన్ కనీసం 120 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయలేదా అని తీవ్ర విమర్శలు గుప్పించాడు. కాగా భారీ లక్ష్య ఛేదనలో హార్థిక్ పాండ్యా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తంగా ఛేజింగులో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 246/5 స్కోరు మాత్రమే చేయగలిగింది.