మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 జులై 2024 (14:00 IST)

వైకాపా కంబంధ హస్తాల నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి!!

vijayasai reddy
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. గత ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఆయన అనుచరగణం కంబంధ హస్తాల్లో చిక్కుకునివుంది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పిట్లో పెట్టుకున్న ప్రస్తుత ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
కాగా, వైకాపా ప్రభుత్వం ఆ పార్టీ ఎంపీగా విజయసాయి రెడ్డి ఏసీఏని తన జేబు సంస్థలా మార్చేసుకుని... అధ్యక్షుడు సహా మొత్తం పదవులన్నీ తన బంధుగణం, అనుచరులతో నింపేసిన విషయం తెల్సిందే. సాయిరెడ్డి అల్లుడి అన్న, ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి గోపీనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 
 
శరత్ చంద్రారెడ్డి, మోహిత్ రెడ్డి పేరుకే అధ్యక్ష, ఉపాధ్యక్షులు. ఏసీఏని గోపీనాథ్ రెడ్డే తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. తన ఆడిటరేనే ఏసీఏ కోశాధికారిగా నియమించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో శరత్ చంద్రా రెడ్డి ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో గోపీనాథ్ రెడ్డి కోశాధికారిగా ఉన్నారు. 2022 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా చక్రం తిప్పారు. అప్పటివరకు విజయవాడ కేంద్రంగా ఏసీఏ పనిచేస్తుండగా దాని పగ్గాలు సాయిరెడ్డి మనుషుల చేతుల్లోకి వెళ్లిన వెంటనే, జగన్ మెప్పు కోసం ఏసీఏ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్టణానికి మార్చేశారు.
 
మరో 40 రోజుల్లో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షుడు సహా, ఎపెక్స్ కౌన్సిల్లోని వారంతా రాజీనామా చేయనున్నారు. ఈ నెల 21న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు 35-40 రోజుల సమయం పడుతుందని అంచనా.