శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (11:39 IST)

చెన్నై టెస్ట్ మ్యాచ్ : భారత్‌పై ఇంగ్లండ్ సానుభూతి.. ఫాలో ఆన్ లేకుండానే..

చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ సానుభూతి చూపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండానే ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత్ ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. కానీ, 337 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ భారత్‌ను ఫాలోఆన్ ఆడించలేదు.
 
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో  578 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 337 పరుగులకు ఆలౌట్ అయింది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన కోహ్లి సేన‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. 
 
ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్‌) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన త‌ర్వాత అవ‌త‌లి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డంతో సుంద‌ర్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు. 
 
ఇప్ప‌టికీ ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. అయితే ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ ఆడాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోవ‌డం విశేషం. అశ్విన్ బౌలింగ్‌లో బ‌ర్న్స్ (0) డ‌కౌట‌య్యాడు.