1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (18:19 IST)

సఫారీ గడ్డ.. టీమిండియా అడ్డా: విరాట్ కోహ్లీ రికార్డుల పంట

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది.
 
రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
 
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కాగా... సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది.
 
ఇకపోతే.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటకపోయినా సారథిగా దుమ్ములేపాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ సూపర్ కెప్టెన్సీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో చాకచక్యంగా వ్యవహరించిన కోహ్లీ.. ఈ గెలుపుతో కెప్టెన్‌గా పలు ఘనతలను సొంతం చేసుకున్నాడు. సెంచూరియన్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలవగా.. కెప్టెన్‌గా కోహ్లీ కూడా ఆ క్రెడిట్ అందుకున్నాడు. అంతేకాకుండా రెండు బాక్సిండే టెస్ట్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.
 
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 40వ విజయం కాగా.. ఈ ఘనతను అందుకున్న నాలుగో కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక విజయాలందుకున్న భారత్ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. 
virat kohli
 
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 17 విజయాలు సాధించగా.. ధోనీ 16 మ్యాచ్‌లు గెలిచాడు. ఇక సెంచూరియన్ వేదికగా ఓటమెరుగని సౌతాఫ్రికాకు కోహ్లీసేన ఆ రుచి చూపించింది. సఫారీ విజయాల కోటలను బద్దలు చేసింది.