1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (07:42 IST)

తొలి ట్వంటీ-20లో విండీస్ చిత్తు - భారత్ విజయం

కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. వెస్టిండీస్ నిర్ణయించిన 158 పరుగుల టార్గెట్‌ను మరో 7 బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో గెలుపొందింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరేబియన్ కుర్రోళ్లకు ఆరంభంలోనే భారత బౌలర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. తొలి ఓవర్‌లోనే బ్రెండన్ కింగ్ (4) ఔట్ అయ్యాడు.  మరో ఓపెనర్ మేయర్స్ (31)క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వెస్టిండీస్ ఆటగాళ్లు పరుగులు చేయలేకపోయారు. 
 
ఫలితంగా ఛేజ్ 4, పావెల్ 2, హోసీస్ 10 స్మిత్ 4 చొప్పున అతి తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. అయితే, పూరన్ మాత్రం భారత బౌలర్లకు ఎదురొడ్డి అర్థ సెంచరీతో రాణించి 61 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... రోహిత్ శర్మ (40), ఇషాన్ కిషన్ (35), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (8), సూర్య కుమార్ యాదవ్ (34), వెంకటేష్ అయ్యర్ (24) చొప్పున పరుగులు చేయడంతో నాలుగు వికెట్ల నష్టానికి ఏడు బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.