గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:13 IST)

చిరస్మరణీయ ఘట్టాలకు వేదిక.. మొతెరా మైదానం విశేషాలు..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతెరా మైదానం.. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య బుధవారం నుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ కు ఓ ప్రత్యేకత ఉంది. 'సర్దార్‌ పటేల్‌ స్టేడియం'గా కూడా పిలిచే మొతెరాలో 1983 నవంబర్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ జరిగింది. సునీల్‌ గవాస్కర్‌ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్ తన 432 వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది.
 
అనంతరం 2006 చాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో ఈ స్టేడియాన్ని ఆధునీకరించారు. ఆతర్వాత 2011 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. ఈ గ్రౌండ్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ 2012 డిసెంబర్‌లో జరిగింది. అనంతరం 2015 అక్టోబర్‌లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అప్పటి జీసీఏ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో స్టేడియాన్ని కూలగొట్టి.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు.
 
2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గతేడాది 'నమస్తే ట్రంప్‌' ప్రోగ్రాం ఇక్కడే జరిగింది. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్‌ పోటీలకు గ్రౌండ్‌ ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం తొలిసారి టెస్టు మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. పైగా ఈ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్ తో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో మైదానం మరింత కాంతివంతంగా మెరవబోతోంది. 
 
మొతేరా స్టేడియం విశేషాలు
దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. అయితే స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవడం మరో విశేషం. సబర్మతి నది ఒడ్డున స్టేడియం కోసం 100 ఎకరాలను 1982లో గుజరాత్ ప్రభుత్వం కేటాయించింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ 49,000 సామర్థ్యమున్న పాత స్టేడియాన్ని కూలగొట్టి సుమారు రూ.678 కోట్లతో 1 లక్షా 10వేల సీటింగ్ తో కేవలం 9నెలల్లోనే పునర్నిర్మించింది. ప్రస్తుతం మైదానంలో 11 పిచ్‌లు ఉన్నాయి. ఎరుపు, నలుపు మట్టితో వికెట్లను సిద్ధం చేశారు. మైదానంలోని ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బెర్ముడా గడ్డిని వాడారు.
 
పిల్లర్లు లేకుండా స్టేడియాన్ని నిర్మించడం మరో అద్భుతం. ప్రేక్షకులు స్టేడియంలోని ఏ మూల కూర్చున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను తిలకించొచ్చు.
 
55 గదులు, ఇండోర్‌.. ఔట్‌డోర్‌ క్రీడలు, రెస్టారెంట్లు, ఒలింపిక్‌ ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం, పార్టీ ఏరియా, 3డి థియేటర్‌లతో క్లబ్‌హౌస్‌ను ఈ స్టేడియంలో నిర్మించారు. క్రికెట్‌ అకాడమీ, ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లూ స్టేడియంలో భాగమే.