గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (20:22 IST)

ఆసియా కప్‌లో నేడు.. హాంకాంగ్ బౌలింగ్ - రోహిత్ శర్మ

teamindia
ఆసియా కప్ టోర్నీలోభాగంగా బుధవారం భారత్, హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ బౌలింగ్ ఎంచుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఏఈతో ఆడిన జట్టుతోనే తాము బరిలోకి దిగుతున్నట్టు హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ వెల్లడించారు. 
 
టాస్ కోల్పోవడంపై రోహిత్ శర్మ స్పందిస్తూ, ఒకవేళ టాస్ గెలిచివుంటే తాను కూడా బౌలింగ్ ఎంచుకుని వుండేవాడినని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలి మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. 
 
కాగా, భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది. మరోవైపు, ఆప్ఘనిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయ భేరీ మోగించి సూపర్-4కు దూసుకెళ్లింది. ఈ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లను ఓడించడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (21) ఔటయ్యారు. ఆయుష్ శుక్లా వేసిన ఐదో ఓవర్‌లో భారీ షాట్‌తో బౌండరీ బాదిన రోహిత్ మరుసటి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని ఐజాక్ ఖాన్ చక్కగా అందుకోవడంతో రోహిత్ మైదానం వీడాల్సివచ్చింది. దీంతో 38 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. తొలి పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు 44/1 స్కోరు నిలిచింది.
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టు వివరాలను పరిశీలిస్తే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జడేజా, దినేష్ కార్తీక్, యజ్వేంద్ర చాహల్, ఆవేష్ కాన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.