శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆసియా కప్ : నేడు పసికూన హాంకాంగ్ జట్టుతో భారత్ ఢీ

team india
ఆసియా కప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. ఇందులో క్రికెట్ పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఇపుడు మలిపోరుకు సిద్ధమైంది. పాక్ మ్యాచ్‌లో కాస్త తబడినట్టు కనిపించిన భారత్.. బుధవారం జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం లేకపోలేదు. 
 
ముఖ్యంగా, టాపార్డర్ గాడినపడేందుకు ఇది ఓ మంచి అవకాశంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడనుంది. అదేసమయంలో అగ్రశ్రేణి ఆటగాళ్లతో నిండిన టీమిడింయాతో తలపడటమే హాంకాంగ్ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా హాంకాంగ్‌తో పోల్చుకుంటే భారత్ బలంగా కనిపిస్తుంది. 
 
అయితే, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో పట్టుదల కనబర్చిన హాంకాంగ్.. రోహిత్ సేనకు కనీస పోటీని ఇవ్వాలన్న గట్టి సంకల్పంతో బరిలోకి దిగనుంది. అలాగే, పాకిస్థాన్ మ్యాచ్‌లో అమితంగా ఆకట్టుకున్న భారత బౌలర్లు.. బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 147 పరుగులు ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించేందుకు సైతం భారత జట్టు ఆపసోపాలు పడ్డారు. 
 
కానీ, హాంకాంగ్ మ్యాచ్‌‍లో తమ లోపాలను సరిచేసుకుని ఈ టోర్నీని విజయవంతంగా ముగించాలన్న రోహిత్ సేన కోరుకుంటుంది. అయితే, హాంకాంగ్ జట్టును ఏమాత్రం తేలికగా తీసుకున్నా తప్పు చేసినట్టే. క్రికెట్‌లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.