మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం దీపావళి బహుమతి ఇచ్చింది. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న కరవు భత్యంలో ఒక విడతను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచారు. ఈ పెంపుదల 2024 జనవరి ఒకటో తేదీ నుంచే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా 3.64 శాతం కరవు సహాయం (డీఆర్) పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డీఏ బకాయిలలో ఒకదానిని విడుదల చేస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ పండగ సమయంలో ఈ డీఏను మంజూరు చేయడం గమనార్హం. పెంచిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా త్వరలోనే ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నట్టు సమాచారం.