'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్
'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్కు రైల్వేశాఖ తేరుకోలేని షాక్ ఇచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి ప్రకటనగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై రైల్వే శాఖ స్పందించింది. దేశ వ్యాప్తంగా నడిపే 12 వేల రైళ్ల జాబితాను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసి కాంగ్రెస్ నేతలకు షాకిచ్చింది.
ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ, దీపావళితో పాటు ఛాత్ పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఓ ప్రటన చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. 'రీల్ మినిస్టర్... 12 వేల రైళ్లు ఎక్కడ?' అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వ్యంగ్యంగా ప్రశ్నించింది.
దీనిపై రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. పండుగ సీజనులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు, నవంబరు నెలల్లో దేశ వ్యాప్తంగా నడపనున్న ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితాను 'ఎక్స్'లో షేర్ చేసింది. ఈ జాబితాలో జోన్ వారీగా నడిపే ప్రత్యేక సర్వీసులు, రైలు సంఖ్యలు, మార్గాలు, షెడ్యూల్ వివరాలను పొందుపరిచింది.
రైల్వే శాఖ ప్రతిస్పందిస్తూ.. 'ప్రయాణికులు పండుగ సమయంలో తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఈ ప్రత్యేక రైలు సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ప్రజల్లో గందరగోళం రేకెత్తించేలా తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలను పోస్ట్ చేయవద్దు' అని కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా విజ్ఞప్తి చేసింది.
పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లే నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. మొత్తంగా '12 వేల రైళ్లు లేవు' అని కాంగ్రెస్ చేసిన విమర్శలకు రైల్వే శాఖ గట్టిగా బదులిచ్చింది. పండుగ సీజనులో నడుపుతున్న ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేయడం ద్వారా తమ వాదనకు ఆధారాలు చూపిస్తూ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కౌంటరిచ్చింది.