మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (10:21 IST)

పంజాబ్‌కు చుక్కలు.. క్రిస్ గేల్ చితక్కొట్టినా రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

ఐపీఎల్ 2020లో భాగంగా పంజాబ్‌కు రాజస్థాన్‌ చుక్కలు చూపించింది. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం వెరవకుండా.. స్టోక్స్‌, శాంసన్‌ వీరబాదుడు బాదడంతో.. స్మిత్‌ సేన సునాయాస విజయాన్నందుకుంది. డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయాలనుకున్న పంజాబ్‌ ఓటమి వైపు నిలిస్తే.. ఈ విజయంతో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. 
 
పంజాబ్‌ వరుస విజయాల జైత్రయాత్రకు రాజస్థాన్‌ బ్రేక్‌ వేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌ శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో4 వికెట్లకు 185 పరుగులు చేసింది. 
 
యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోగా.. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 
 
అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించారు. 
 
టార్గెట్‌ ఛేజింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ పూనకం వచ్చినట్లు చెలరేగిపోవడంతో రాజస్థాన్‌కు అద్భుత ఆరంభం లభించింది. స్టోక్స్‌ ధాటికి రాయల్స్‌ 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మైలురాయిని దాటింది. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ పంజాబ్‌ను భయపెట్టిన స్టోక్స్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాక ఔటయ్యాడు. 
 
అప్పటి వరకు ప్రేక్షకపాత్రకు పరిమితమైన ఊతప్ప (30), శాంసన్‌ కూడా ధాటిగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 103/1తో నిలిచింది. కాసేపటికి శాంసన్‌ రనౌట్‌ కాగా.. స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) భారీ షాట్లతో విజృంభించి మరో 15 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు.