1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (12:40 IST)

ఆన్‌లైన్ బెట్టింగ్... యాప్ డ్రీమ్‌లో రూ.కోటిన్నర గెలుపు.. ఎస్ఐపై చర్యలు

అనేక రాష్ట్రాల్లో ఆన్‌‍లైన్ బెట్టింగులపై నిషేధం కొనసాగుతుంది. ఇలాంటి బెట్టింగులకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు... తామే ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ భారీగా నగదును గెలుచుకుంటున్నారు. తాజాగా ఓ ఎస్ఐ కేడర్ పోలీస్.. యాప్ డ్రీమ్‌11లో కోటిన్నర రూపాయలను గెలుచుకుని వార్తల్లో నిలిచారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి పోలీస్ ఆన్‌లైన్ బెట్టింగులో పాల్గొని పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎస్ఐను సస్పండ్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రీ - ఛించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. 
 
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా, జరిగిన ఇంగ్లండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి ఎస్ఐ సోమ్‌నాథ్ రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. 
 
నిబంధనలను అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే ధ్రువీకరించారు. ఇక్కడ పనిచేసే సోమనాథ్ అక్టోబరు 10వ తేదీన విధుల్లో ఉంటూనే ఇంగ్లండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.