1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (09:17 IST)

'అర్జున అవార్డు' కోసం మహ్మద్ షమీ పేరు

shami
ఇటీవల స్వదేశంలో ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా రాణించారు. భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అన్ని లీగ్ మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లను తన బౌలింగ్‌తో వణికించాడు. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లు రాణించలేకపోవడంతో భారత్ చివరి గట్టుపై బోల్తాపడి, ప్రపంచ కప్‍‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డు కోసం మహ్మద్ షమీ పేరును సిఫార్సు చేశారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ అతడి పేరును ప్రతిపాదించింది. 
 
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమీకి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్ షమీ ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో షమీ అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యాడని తెలుస్తోంది. దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు అన్న విషయం తెలిసిందే.
 
వరల్డ్ కప్ షమీ అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేని షమీ ఆ తర్వాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్‌గా నిలిచాడు.