గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:52 IST)

ధోనీని అవుట్ చేశానోచ్.. నా కల నెరవేరింది.. స్లో ఓవర్ రేట్.. రూ.12లక్షల జరిమానా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోని వికెట్‌ తీయాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అవేశ్‌ ఖాన్ హర్షం వ్యక్తం చేశాడు. మూడేళ్ల క్రితం ఈ అవకాశం వచ్చినట్టే వచ్చే చేజారిందని, అయితే ఇప్పుడు ప్రణాళిక పక్కాగా అమలు చేయడం ద్వారా అనుకున్నది సాధించగలిగానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అవేశ్‌, కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసి సత్తా చాటాడు. 
 
ఈ క్రమంలో ఐపీఎల్‌-2021 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అవేశ్‌పై నమ్మకం ఉంచడంతో, తుదిజట్టులో అతడికి చోటు లభించింది.  దీంతో డీసీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌లో, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని‌.. డుప్లెసిస్‌, ఎంఎస్‌ ధోని వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసి కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ నేపథ్యంలో ధోని వికెట్‌ తీయడంపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రెండు బంతులు ఎదుర్కొన్న ధోని, పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పంత్‌ సేన, ఏప్రిల్‌ 15న రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబైలో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. 
 
అయితే తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌‌కు ఊహించని విధంగా షాక్ తగిలింది. అలాగే మ్యాచ్ ముగిసిన తరువాత మిస్టర్ కూల్ కి మరో షాక్ తగిలింది. చెన్నై కెప్టెన్ కి రూ.12లక్షల జరిమానా పడింది. కేటాయించిన టైంలోపే ఓవర్లను పూర్తి చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల కొన్ని నిబంధనలు తెచ్చింది. కానీ స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా తప్పలేదు. టోర్నీలో ఇదే సీన్ రిపీట్ అయితే జరిమానా డబులయ్యే అవకాశం ఉంది.