శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (15:53 IST)

సొంతగడ్డపై వరుస ఓటములకు ఫుల్‌స్టాఫ్ పెట్టిన పాకిస్థాన్!

pakistan team
ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టుకు సొంత గడ్డపై విజయం వరించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ముల్తాన్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టును 152 పరురుగుల తేడాతో చిత్తు చేసింది. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో 297 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 144 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో పాక్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ఇంగ్లీష్ బ్యాటర్లను వణించారు. నొమల్ 8 వికెట్లు తీస్తే, సాజిద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇలా ఈ ఇద్దరే ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
 
ఇంగ్లండ్ బ్యాటర్లలో సారథి బెన్ స్టోక్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. పాక్ తొలి ఇన్నింగ్స్ 366 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 291 రన్స్ చేసింది. దాంతో ఆతిథ్య జట్టుకు 75 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 
 
అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ 75 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే పరిమితమైంది.
 
ఇక ఈ విజయంతో మూడు మ్యాచుల టెస్టు సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 48 పరగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో మాత్రం దాయాది జట్టు అద్భుతంగా పుంజుకుని మంచి విజయాన్ని నమోదు చేసింది.
 
పాకు సొంత గడ్డపై విజయం దక్కి 1350 రోజులు అవుతోంది. చివరిసారిగా 2021లో సౌతాఫ్రికాపై పాక్ టెస్టులో విక్టరీ నమోదు చేసింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండైపై విజయంతో ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించినట్లైంది.