1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (10:44 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : దాయాదుల పోరు ఎక్కడంటే?

india vs  bangla
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో భాగంగా, చిరకాల ప్రత్యర్థులైన, దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడే మ్యాచ్‌కు వేదికను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ షెడ్యూల్‌ను ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత అధికారికంగా వెల్లడించనున్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 5వ తేదీ నుంచి ప్రపంచకప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. అహ్మదాబాద్‌లో ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ జట్టు తలపడుతుంది. 
 
ఇక అతిథ్య భారత్ జట్టు చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ టోర్నీని అరంభించనుంది. అయితే టోర్నీ అసలు సిసలైనపోరు అక్టోబరు 15వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ, ఆ వేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఉండటంతో ఇక్కడ ఆడేందుకు పాకిస్థాన్ వెనుకంజ వేసినట్టు సమాచారం. 
 
నిజానికి పాకిస్థాన్ వర్సెస్ భారత్‌ మ్యాచ్‌కు అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులను బీసీసీఐ ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌లో ఆడేందుకు పీసీబీ విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. ఈ వేదికల ఖరారును త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.