ఆసియా కప్ కోసం పాక్ క్రికెట్ జట్టు ఇదే - ఆ ఇద్దరికి మొండిచేయి
ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టు బోర్డు జట్టును ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టులో పాక్ స్టాక్ ఆటగాళ్ళు బాబర్ అజామ్, మమ్మద్ రిజ్వాన్లకు మొండిచేయి చూపించింది. జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అలీ అఘాను ఎంపిక చేసింది. అలాగే, షహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్లకు చోటు కల్పించింది. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భాగంగా, భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబరు 14వ తేదీన కీలక పోరు జరుగుతుంది.
యూఏఈ, ఆప్ఘనిస్థాన్తో జరుగనున్న ముక్కోణపు సిరీస్తో పాటు ఆసియా కప్ కోసం కూడా ఇదే జట్టును పీసీబీ ఖరారు చేసింది. జట్టులో స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది, ఫఖార్ జమాన్, హరీస్ రవూఫ్, హాసన్ అలీ వంటి సీనియర్లకు చోటుకల్పించారు. వికెట్ కీపర్గా మహ్మద్ హరీస్ను ఎంపిక చేశారు. ఆ సమయంలో సయీమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబరు 9 నుంచి 28వ తేదీ వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్, భారత్, యూఏఈ, ఒమన్లతో కలిసి గ్రూపు ఏలో ఉంది. పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ను సెప్టెంబరు 12వ తేదీన ఒమన్తో ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ సెప్టెంబరు 14వ తేదీన జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబరు 17వ తేదీన యూఏఈతో పాక్ తలపడుతుంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు...
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హాసన్ అలీ, హాసన్ నవాజ్, హుస్సేన్ తలత్, షుష్దిల్ షా మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోఖిమ్.