శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (15:06 IST)

జాంబవంతుల రికార్డులను చెదరగొట్టిన క్రికెటర్ ఎవరు? (Video)

నేపాల్ క్రికెటర్, కెప్టెన్ అయిన పరాస్ ఖడ్గా.. జాంబవంతుల రికార్డులను చెదరగొట్టాడు. అంతర్జాతీయ ట్వంటి-20 ఫార్మాట్‌‍లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, స్టీవ్ స్మిత్ వంటి అగ్ర క్రికెటర్లను వెనక్కి నెట్టి కొత్త రికార్డును సృష్టించాడు. జింబాబ్వే, నేపాల్, సింగపూర్ జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ సింగపూరులో జరుగుతోంది. 
 
ఈ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో సింగపూర్, నేపాల్ జట్లు ఢీకొన్నాయి. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సింగపూర్ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది. తదనంతరం బరిలోకి దిగిన నేపాల్ జట్టు 16 ఓవర్లలోనే 154 పరుగులు సాధించి.. తొమ్మిది వికట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు కెప్టెన్ పరాస్ ఖడ్గా 52 బంతుల్లో 9 సిక్సర్లు, ఏడు బౌండరీలతో 106 పరుగులు సాధించి.. చివరి ఓవర్ వరకు అవుట్ కాకుండా నాటౌట్‌‍గా నిలిచి జట్టును గెలిపించాడు. తద్వారా పరాస్ ఖడ్గా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌‍లో సెంచరీ కొట్టిన తొలి నేపాల్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 
 
అంతేగాకుండా టీ-20 ఫార్మాట్‌ ఛేజింగ్‌లో భాగంగా సెంచరీ కొట్టిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇంకా అధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలోనూ పరాస్ ఖడ్గా అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు నెదర్లాండ్‌కు చెందిన పీటర్ (96)తో ఈ రికార్డును సాధించాడు. 
 
ప్రస్తుతం ఆ రికార్డును పరాస్ ఖడ్గా బ్రేక్ చేశాడు. ఇంకా ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ (90), క్రిస్ గేల్ (88), కోహ్లీ (82)లను కూడా వెనక్కి నెట్టాడు. ఏకంగా 106 పరుగులతో టీ-20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా పరాస్ ఖడ్గా అవతరించాడు.