శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (16:17 IST)

దయచేసి మా పాప ఫోటోలు తీయొద్దు : విరాట్ కోహ్లీ వినతి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే, విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. 
 
ద‌య‌చేసి మా పాప ఫొటోలు తీయొద్దు అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శ‌ర్మ ముంబై ఫొటోగ్రాఫ‌ర్ల‌ను కోరారు. త‌మ కూతురి ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని వారు ఫొటోగ్రాఫ‌ర్ల‌కు రాసిన లేఖ‌లో అడిగారు. 
 
'ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం మిమ్మల్ని కోరేది ఒక్కటే. మా బిడ్డ ప్రైవసీని మేము కాపాడాలి. ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలి. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి. మా విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అంటూ విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, స‌రైన స‌మ‌యంలో త‌మ పాప ఫొటోల‌ను రిలీజ్ చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 11న త‌మ‌కు పాప పుట్టింద‌ని కోహ్లి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విరాట్ సోద‌రుడు వారికి కంగ్రాట్స్ చెబుతూ.. ఓ ఫొటో షేర్ చేయ‌డంతో అది వాళ్ల పాప‌దే అంటూ అభిమానులు వైర‌ల్ చేసేశారు. కానీ ఆ ఫొటో ఆ పాప‌ది కాదు అని మ‌రోసారి కోహ్లి సోద‌రుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.