శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:53 IST)

హైదరాబాద్ క్రికెటర్లపై బీసీసీఐ సెలక్టర్లు వివక్ష...

వచ్చేనెలలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌ క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు కల్పించలేదు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 
 
అయితే, భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా మాత్రం మండిపడ్డారు. హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రతీసారి అన్యాయం జరగడం ఆసక్తి రేపుతుందని.. గతంలో తనకు కూడా ఇలాగే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే రాయుడును పక్కన పెట్టడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతుంటే.. ఓఝా మాటలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. 
 
మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అర్థాంతరంగా జట్టుకు దూరమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌కు రాయుడును కాదని త్రీ డైమెన్షన్ ప్లేయర్ తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై... అంబటి ట్విట్టర్ వేదికగా రాబోయే మెగాటోర్నీ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ చేస్తున్నాఅని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెల్సిందే. 
 
దీనికి మద్దతుగా ఓఝా హైదరాబాదీ క్రికెటర్లకే ఇలా జరగడంపై చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా.. ఆ బాధేంటో నాకు తెలుసని ట్వీట్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి టెస్టులో వెస్టిండీస్‌పై 10 వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచిన ఓఝా ఆ తర్వాత అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరపున 24 టెస్టులు ఆడిన ప్రజ్ఞాన్ ఓఝా 113 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 18 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.