1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (15:14 IST)

భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా భావిస్తారు... విమర్శలు ఎదుర్కొంటున్నాం : మైఖేల్ వాన్‌కు అశ్విన్ కౌంటర్

ashwin
భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా భావిస్తారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు భారత బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. సౌతాఫ్రికా పర్యటనను ముగించుకుని భారత క్రికెట్ జట్టు స్వదేశానికి వచ్చారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఒక్క సిరీస్‌నూ కోల్పోకుండా స్వదేశానికి చేరింది. తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్ భారత్‌ను ఉద్దేశించి తక్కువ స్థాయి జట్టు అంటూ చేసిన వ్యాఖ్యలకు.. స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
 
'మైఖేల్ వాన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నాకు నవ్వొచ్చింది. అవును, మేం గత కొన్నేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాం. మాది క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టు. ఇటీవల టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమ్‌ మాదే. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో టాస్‌ గెలిచి తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ చేసి ఉంటే.. 65 పరుగులకే ఆలౌటయ్యేదేమో? మేం కూడా 24/3 స్కోరుతో ఇబ్బంది పడినప్పుడు విరాట్ - శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడు. చివరికి మేం 245 పరుగులు చేశాం. 
 
టెస్టు క్రికెట్‌కు, ఇతర ఫార్మాట్లకు స్పష్టమైన విభజన ఉంది. భారత్‌లో క్రికెట్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు. దీనిని ఓ మతంగా భావిస్తారు. అందుకేనేమో మేం ఎక్కువగా విమర్శలకు గురవుతుంటాం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను ఓ ఆటగా చూడాలి. నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించడం చాలా ముఖ్యం. మానసిక దృఢత్వం, అద్భుత నైపుణ్యాలు కలిగి అత్యుత్తమ క్రికెట్‌ ఆడితే తిరిగి పుంజుకోవడం పెద్ద కష్టమేం కాదు. టీమ్‌ఇండియా ఇలా ఎన్నోసార్లు నిరూపించుకుంది. మేం రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. అభిమానులు బాధపడ్డారని అంగీకరిస్తా' అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.