1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ - బుమ్రాకు టెస్ట్ పగ్గాలు!

Bumrah_Sanjana
టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అయితే, అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన హోటల్ గదికే పరిమితమయ్యాడు. పైగా, తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకుండాపోతాడు. దీంతో అతని స్థానంలో జట్టు కెప్టెన్‌గా బుమ్రాకు నాయకత్వ పగ్గాలు అప్పగించనున్నారు. 
 
దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, 'రోహిత్‌కు తాజాగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్న అతను.. ఇంగ్లండ్‌తో టెస్టుకు అందుబాటులో ఉండడు. కేఎల్‌ రాహుల్‌ కూడా అందుబాటులో లేడు కాబట్టి గతంలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా జట్టు పగ్గాలు చేపడతాడు' అని ఆయన తెలిపారు. 
 
కానీ టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం రోహిత్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు ధ్రువీకరించలేదు. 'రోహిత్‌ పరిస్థితిని వైద్య బృందం సమీక్షిస్తోంది. అతనింకా మ్యాచ్‌కు దూరం కాలేదు. అందుబాటులోకి రావాలంటే రెండుసార్లు కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావాలి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం పరీక్షలు జరుగుతాయి. ఏం జరుగుతుందో చూద్దాంట అని ద్రవిడ్ పేర్కొన్నారు. 
 
మరోవైపు రోహిత్‌ మ్యాచ్‌కు దూరమైతే ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై ద్రవిడ్‌ సంప్రదిస్తే, దీనిపై ప్రకటన చేయాల్సింది చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ అని, తాను కాదన్నారు. ఒకవేళ బుమ్రాకు పగ్గాలు దక్కితే కపిల్‌ దేవ్‌ (1987) తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న ఫాస్ట్‌బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.