1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (14:57 IST)

సచిన్ టెండూల్కర్ ఉదారత.. దీప్తీ కల అలా నెరవేరింది..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాస్టర్ తాజాగా 19 ఏళ్ల యువతి చదువుకు తన వంతు సాయం అందించాడు. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన 19 ఏళ్ల దీప్తి విశ్వాస్ రావు అనే యువతి డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడానికి సచిన్ ముందుకు వచ్చాడు. 
 
దీప్తికల నెరవేరితే.. రత్నగిరిలోని జారీ గ్రామంలోనే మొదటి వైద్యురాలు అవుతుంది. ఇందుకోసం ఆమె రాత్రి, పగలు కష్టపడుతోంది. ఈ ప్రయత్నంలో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సచిన్ సేవా సంస్థ సహ్యోగ్ ఫౌండేషన్ ఆమె కల నెరవేర్చేందుకు ముందుకు వచ్చింది.
 
రైతు కుటుంబంలో జన్మించిన దీప్తీ.. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి నెట్‌వర్క్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇందుకోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులన్నీ దాటుకొని కష్టపడి చదివింది. ఫలితంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో దీప్తి 720 మార్కులకు గాను 574 సాధించింది. ఆమెకు అకోలాలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. 
 
అయితే ఉన్నత చదువుకు అవసరమైన డబ్బును దీప్తి కుటుంబం సమకూర్చలేకపోయింది. ఇప్పటికే తన చదువు కోసం బంధువులు, తెలిసినవారి దగ్గర నుంచి అప్పు తీసుకొని ప్రవేశ రుసుము చెల్లించారు. ఈ సమయంలో దీప్తి చదువుకు, ఇతర ఖర్చుల కోసం సచిన్ సహాయం అందించాడు. సేవా సంస్థ ద్వారా ఆమెకు స్కాలర్‌షిప్ ఇచ్చాడు. తనకు అండగా నిలిచినందుకు సచిన్ ఫౌండేషన్‌‌కు దీప్తి కృతజ్ఞతలు తెలిపింది.