శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 22 జూన్ 2019 (14:19 IST)

పందిలావున్నావంటూ దూషణ : సర్ఫరాజ్‌ను ఆటాడుకున్న అభిమాని

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్టు పేలవ ప్రదర్శనతో నలువైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, భారత్ చేతిలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోవడంతో ఆ దేశ క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహావేశాలను ఎదుర్కొంటోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలప ప్రదర్శనతోపాటు చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతో పాటు.. ఆ దేశ మాజీ క్రికెటర్లు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ముఖ్యంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిస్తే మాత్రం తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని పాక్ మాజీ కెప్టెన్, ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సూచన చేశారు. కానీ, సర్ఫరాజ్ మాత్రం టాస్ గెలిచినప్పటికీ... భారత్‌కు బ్యాటింగ్ అప్పగించి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సర్ఫరాజ్ నిర్ణయం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. అత్యంత పటిష్టంగా ఉన్న భారత్‌కు బ్యాటింగ్ అప్పగించడంతోనే పాకిస్థాన్ జట్టు సగం ఓటమిని  చవిచూసిందనీ, మిగిలిన సగం ఓటమి మ్యాచ్‌లో ముగిసిందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో ఉంటున్న పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఓ మాల్‌కు షాపింగ్ చేయడానికి వెళ్లాడు. అపుడు పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని సర్ఫరాజ్‌ను గుర్తుపట్టి అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, అతను మాట్లాడకుండా తప్పించుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ అభిమాని నోటికి పని చెప్పాడు. "పందిలాగ గుండుగా ఉన్నావ్" అంటూ దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.