తెలుగమ్మాయి ధర రూ.1.30 కోట్లు ... ఎందుకో తెలుసా?
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 పోటీలు వచ్చే యేడాది జరుగనున్నాయి. ఈ పోటీల కోసం మహిళా క్రికెటర్ల వేలం పాటలను తాజాగా నిర్వహించారు. ఇందులో తెలుగు అమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీ చరణి సంచలనం సృష్టించింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.1.30 కోట్లకు సొంతంచేసుకుంది. ఇది మహిళా ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర కావడం గమనార్హం.
న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఈ వేలం పాటల్లో శ్రీ చరణి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఆమె ప్రారంభ ధర రూ.30 లక్షలు కాగా, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య హోరాహోరీ బిడ్డింగ్ జరిగింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను దక్కించుకుంది.
గత సీజన్లో కూడా ఆమె ఢిల్లీ తరపున బరిలోకి దిగిన ఆమె.. కేవలం రెండు మ్యాచ్లలో నాలుగు వికెట్లు తీసి, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనే ఆమెకు భారీ ధర పలకడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
కడప జిల్లాకు చెందిన 31 యేళ్ల శ్రీచరణి ఇటీవల భారత జట్టు తరపున వరల్డ్ కప్ టోర్నీలో 9 మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టింది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆమె తన పొదుపైన బౌలింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు, ఈ వేలం పాటల్లో కివీస్ ఆల్రౌండర్ అమీలియా కెర్ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు దక్కించుకుంది. అలాగే, సోఫీ డివైన్ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ మహిళా క్రికెటర్ అలిస్సా హీలి తొలి రౌండ్ వేలం పాటల్లో అమ్ముడు పోకపోవడం గమనార్హం.