గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (09:45 IST)

సూర్యకుమార్ సిక్సర్ల వర్షం... అసాధారణ రికార్డులు

surya kumar
భారత క్రికెట్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా, గురువారం చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ పలు అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సరసన నిలిచాడు. అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు, మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది. 
 
ఇక టీ20 ఫార్మాట్లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3 (చెక్ రిపబ్లిక్- 31 మ్యాచ్‌లు), కోలిన్ మన్రో 3 (న్యూజిలాండ్- 62 ఇన్నింగ్స్), బాబర్ ఆజం 3 (పాకిస్థాన్- 98 ఇన్నింగ్స్) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
 
దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు నమోదయ్యాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడో భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా 'మిస్టర్ 360’ నిలిచాడు. మ్యాక్స్‌వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ భారత్‌లో 3, ఇంగ్లండ్ 1 సెంచరీలు బాదాడు. 
 
కాగా దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 56 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొదటి అర్థసెంచరీ సాధించడానికి 32 బంతులు ఆడిన సూర్య ఆ తర్వాత 23 బంతుల్లోనే రెండో అర్థసెంచరీని నమోదు చేయడం గమనార్హం.