శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (21:53 IST)

మొతేరాలో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు... 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 11 వికెట్లను కైవసం చేసుకున్నాడు. తద్వారా డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 70 పరుగులిచ్చిన అక్షర్.. 11 వికెట్లు తీయడం విశేషం. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో డే-నైట్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. 
 
ఇంతకుముందు ఈ రికార్డు 10 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమీన్స్ పేరిట ఉంది. అలాగే ఇదే మ్యాచులో అక్షర్ పేరిట మరో రెండు రికార్డులు కూడా నమోదయ్యాయి. డే-నైట్ టెస్టులో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీసిన ఎకైక బౌలర్ కూడా అక్షరే. అంతేగాక ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్న మూడో భారత బౌలర్ అక్షర్. ఇంతకుముందు 1984లో లక్ష్మణ్ శివరామక్రిష్ణన్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఫీట్ సాధించారు. 
 
మరోవైపు, ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 49 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
అంతకుముదు... ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కేవలం 112 పరగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 145 రన్ చేసి పది వికెట్లను కోల్పోయింది. ఆపై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్‌ ముంగిట 49 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 10 వికెట్ల తేడాతో మూడో టెస్టును కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ 3 ఫోర్లు 1 సిక్స్ తో 25 పరుగులు చేయగా, శుభ్ మాన్ గిల్ 1 ఫోరు, 1 సిక్స్ తో 15 పరుగులు సాధించిన వేళ... ఒక్క వికెట్టూ నష్టపోకుండా భారత్ గెలుపుతీరాలకు చేరింది.
 
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్టూ తీయలేకపోయారు. పిచ్ స్వభావాన్ని అప్పటికే ఆకళింపు చేసుకున్న భారత ఓపెనర్లు మెరుగైన ఫుట్ వర్క్ తో ఇంగ్లండ్ స్పిన్ దాడులను ఎదుర్కొని చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను తీసుకుని వ్యూహాత్మకంగా దారుణమైన తప్పిదానికి పాల్పడింది. పిచ్ పేస్ కు సహకరించకపోగా, తొలి రోజు నుంచే స్పిన్నర్లకు తోడ్పాటు అందించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేయగా, భారత్ 145 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే చేతులెత్తేసింది. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు తీయడం విశేషం అని చెప్పాలి. అశ్విన్‌కు 7 వికెట్లు లభించాయి. అలాగే, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్, పార్ట్‌టైమ్ బౌలర్ జో రూట్ కూడా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి, టీమిండియాను దెబ్బతీశాడు. 
 
కాగా, ఈ టెస్టు విజయం అనంతరం నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో నిలిచింది. ఇరుజట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు మార్చి 4 నుంచి ఇదే మైదానంలో జరగనుంది.