గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:56 IST)

పింక్ బాల్ టెస్టు.. తొలి రోజు ఆట ముగిసింది.. హిట్ మ్యాన్‌పైనే భారం..

భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియాదే  పైచేయిగా నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, రహానే ఉన్నారు. ఆట ముగిసే సమయానికి కోహ్లీ వికెట్ కోల్పోవడం టీమిండియాకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. 
 
మరోవైపు, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం మ్యాచ్ రోహిత్ మీదే భారంగా మారనుంది. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు పూర్తిగా తేలిపోయింది. 
 
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను తమ స్పిన్ మాయజాలంతో బెంబెలేత్తించారు. ఈ క్రమంలో టీ విరామం తర్వాత కూడా టీమిండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే ఆలౌటైంది.
 
ఆ తర్వాత టీమిండియా తన ఇన్నింగ్స్‌ను బాగానే ఆరంభించింది. రోహిత్ శర్మ చూడచక్కని షాట్లతో అలరించాడు. అయితే, ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డ గిల్ జట్టు స్కోరు 33 పరుగుల వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. 
 
అయితే, ఆ వెంటనే పుజారా కూడా జాక్ లీచ్ బౌలింగ్ లో డకౌటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడ్డట్టు కన్పించింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్క దిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు హిట్ మ్యాన్. 
 
ఈ జోడి మూడో వికెట్ కు 64 పరుగుల పార్టనర్ షిప్ ను నెలకొల్పింది. అయితే, ఆఖర్లో లేని షాట్‌కు వెళ్లి.. లీచ్ బౌలింగ్ లో ఔటయ్యాడు కోహ్లీ. దీంతో టీమిండియా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.