శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:29 IST)

ఒకే రికార్డు కోసం నువ్వానేనా అంటున్న కోహ్లీ - ధోనీ

భారత క్రికెట్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న క్రికెటర్లు ఇద్దరే ఇద్దరని చెప్పొచ్చు. వారు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా, టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
 
అయితే, ఇపుడు ఈ ఇద్దరు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి తమ పేరున లిఖించుకునేందుకు కోహ్లీ - ధోనీలు పోటీపడుతున్నారు. వెస్టిండీస్‌తో విశాఖపట్నంలో బుధవారం జరగబోయే రెండో వన్డేలోనే ఈ ఇద్దరూ రికార్డు అందుకుంటే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. 
 
తొలి వన్డేలో 140 పరుగులు చేసిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయిని అందుకోవడానికి కేవలం 81 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను ఈ మార్క్ చేరుకుంటే వన్డేల్లో 10 వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా, ఓవరాల్‌గా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.
 
అయితే కోహ్లీ మాత్రం అత్యంత వేగంగా 10 వేల పరుగుల మార్క్ అందుకున్న రికార్డును సొంతం చేసుకుంటాడు. కోహ్లీ ప్రస్తుతం 204 ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం 259 ఇన్నింగ్స్‌తో సచిన్ పేరిట ఈ రికార్డు ఉంది. ఆ రికార్డు తెరమరుగవడం ఖాయంగా కనిపిస్తున్నది. 
 
అలాగే, వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి కోహ్లీ 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక్కడా సచిన్ రికార్డును అతను బ్రేక్ చేయనున్నాడు. 
 
అటు ధోనీ ఇప్పటికే వన్డేల్లో 10 వేల మార్క్‌ను అందుకున్నా.. అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరపున సాధించినవి ఉన్నాయి. అతడు కేవలం భారత్ తరపున 10 వేల మార్క్ అందుకోవడానికి ఇంకా 51 పరుగుల దూరంలో ఉన్నాడు. మరి తనకు ఎంతగానో అచ్చొచ్చిన వైజాగ్‌లో ధోనీ ఈ మార్క్ అందుకుంటాడేమో వేచి చూడాల్సిందే.