1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (12:33 IST)

దేశం కోసం ఆడుతున్నాను.. కానీ తొలి బిడ్డ పుట్టే క్షణం కోసం..?: విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ సిరీస్ నుంచి స్వదేశం చేరుకోనున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల టోర్నీలో తొలి టెస్టుకు మాత్రం నాయకత్వం వహించి స్వదేశానికి చేరుకోనున్నాడు. తమ తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో తాను కూడా భార్య అనుష్క పక్కనే ఉండటంపై చాలా స్పష్టతతో ఉన్నానని కోహ్లీ చెప్పాడు. ఏవిధంగా చూసినా సరే ఆ క్షణాల్ని ఎవరూ మిస్ కాకూడదని వివరించాడు.
 
కోహ్లీ టోర్నీ మధ్యలోనే అలా వెనక్కు వచ్చేయడానికి బీసీసీఐ కూడా ఆమోదించి పితృత్వ సెలవును మంజూరు చేసింది. దేశం కోసం ఆడుతున్నా.. తొలి బిడ్డకు జన్మనివ్వడం అనేది జీవితంలోనే అత్యంత ప్రత్యేక క్షణం. అందుకే భార్య సమక్షంలో గడపాల్సిందే అని కోహ్లీ ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఆటపై మనసుపెట్టి అత్యున్నత స్థాయిలో ఆడాలనే విషయం నాకు తెలుసు. మా నాన్న చనిపోయినప్పుడు కెరీర్ కోసం ఆటలో ఉండాల్సిందేనని అప్పట్లో నేను నిజంగానే భావించాను. ఆటగురించి, కెరీర్ గురించి చాలా సీరియస్‌గా ఆలోచించాల్సిన క్షణాలవి.
 
నా దృష్టిని మరే విషయంపైకీ మరలించరాదని నిబద్ధత పాటించాను. ఆ రోజునుంచే భారత్‌కోసం అలా ఆడుతూనే ఉండాలని, వీలైనంత కాలం ఆడుతూనే ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కోహ్లీ చెప్పాడు. తన పరోక్షంలో అజింక్యా రహానే టీమ్‌ను ఎలా లీడ్ చేస్తాడనే విషయం తనకూ ఎంతో ఆసక్తి కలిగిస్తోందని విరాట్ కోహ్లీ చెప్పాడు. 
 
తనకు దక్కిన ఈ అవకాశాన్ని అజింక్యా ఎలా ఉపయోగించుకుంటాడనేది ఆసక్తికరమైన విషయమేనని అభిప్రాయపడ్డాడు. అజింక్యాకు ఇది సరైన సమయం. ఈ అవకాశాన్ని అతడు సరైనరీతిలో వినియోగించుకుంటాడని భావిస్తున్నాను. అలాగే ఆస్ట్రేలియాపై హనుమ విహారి ఎలా ఆడతాడనేది కూడా తనకు ఎంతో ఆసక్తి కలిగిస్తోందని చెప్పాడు.