1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (13:47 IST)

ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న విరాట్ కోహ్లీ

భారతక్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఫార్మెట్‌లలో అమితంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. పైగా, పలు సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో గెలిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. 
 
సాధారణంగా ప్రతి యేడాది ఐసీసీ వివిధ రకాల వార్షిక అవార్డులను ఇస్తూ వస్తోంది. ఈకోవలోనే 2019 సంవత్సరానికిగాను అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 
 
2019 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌ స్మిత్‌ను ప్రోత్సహించాలని విరాట్‌ తన సైగల ద్వారా అభిమానులకు సూచించాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో.. వార్నర్‌ సహా మరో ఆటగాడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెల్సిందే. 
 
దీంతో స్మిత్‌, వార్నర్‌లకు ఏడాది నిషేధం విధించింది. నిషేధం పూర్తయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మిత్‌ను ఎవరూ పట్టించుకోకపోయే సరికి కోహ్లీ అభిమానులకు తన సైగల ద్వారా స్మిత్‌ను ప్రోత్సహించాలని సూచించాడు. ఇందుకుగానూ కోహ్లీకి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు లభించింది.