శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (14:54 IST)

శ్రీలంకతో టి20 సిరీస్‌.. రెండో టీ-20లో భారత్ ఘనవిజయం

శ్రీలంకతో టి20 సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా మంగళవారం నాడు జరిగిన రెండో టి20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ శ్రీలంకను నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితం చేసింది. 
 
టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. దూకుడుగా ఆడుతున్న ఆవిష్క ఫెర్నాండోను సుందర్ బోల్తా కొట్టించడంతో శ్రీలంక వికెట్ల పతనం ప్రారంభమైంది. అయితే కుశాల్ పెరెరా 34 పరుగులతో కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి లాంగ్ ఆన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోవడంతో అతని పోరాటం ముగిసింది. 
 
ఇక అక్కడి నుండి శ్రీలంక  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే చివరి ఓవర్‌లో హసరంగా చివరి మూడు బంతులను బౌండరీలకు తరలించడంతో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.  
 
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, నవదీప్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. 17.3 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.