1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (22:17 IST)

చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ హల్ హక్ గుడ్‌బై...

inzamam ul haq
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ సెలెక్టర్ పదవికి ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ హల్ హక్ రాజీనామా చేశారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కోసం పాకిస్థాన్ జట్టు ఎంపిక సక్రమంగా జరగలేదన్న ఆరోపణలతో పాటు విమర్శలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా మైదానంలో పాక్ ఆటగాళ్ళ ఆటతీరు కూడా ఉంది. పైగా, ఆ జట్టు వరుస ఓటములను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
 
పీసీసీ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఇంజమామ్ హల్ హక్.. తన రాజీనామా లేఖను పీసీబీ చీఫ్ జకా అష్రాఫ్‌కు పంపించారు. ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదని, జట్టు ఎంపికలో వర్గపోరు నడిచిందంటూ స్వదేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ విమర్శల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఇంజమామ్ హల్ హక్ ప్రపంచ కప్ జరుగుతుండగానే తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు, జట్టు ఎంపికపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు పీసీబీ సిద్ధమైంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మీడియాలో వచ్చిన ఆరోపణలపై పీసీబీ పారదర్శకంగా విచారణ చేపట్టేందుకు వీలుగా తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఇంజమామ్ తెలివిగా ఓ కారణాన్ని చూపడం గమనార్హం.