శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (13:44 IST)

ధోనీని అవుట్ చేయడం నా అదృష్టం.. చిన్న గ్యాప్ ముంచేసింది.. ఫోటో వైరల్

మాంచెస్టర్‌ వేదికగా ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో చివరి వరకు రేసులో ఉన్న ఆపద్భాంధవుడు, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ క్రీజులో వుండటంతో భారత్ గెలుస్తుందనుకున్నారు. కానీ భారత్.. కీలక సమయంలో మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1X4, 1X6) రనౌట్‌ ఔట్ అవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. 
 
లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. 
 
ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. టీమిండియాను ఓడించింది. ఇలా ధోనీని అవుట్ చేయడంతో గప్తిల్ పై కివీస్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం గప్తిల్ అంటేనే మండిపడుతున్నారు. ధోనీ అవుట్ చేయకుండా వుంటే ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచివుండేదని వాపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియోలో మార్టిన్‌ గప్తిల్‌ మాట్లాడుతూ... ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ ధోనీని కీలక సమయంలో డైరెక్ట్‌ హిట్‌ చేశాను. ధోనీని రనౌట్‌ చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ధోనీని అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందన్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ధోనిని గప్తిల్ రనౌట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నపాటి గ్యాప్‌తో ధోనీ రనౌట్‌ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు.