1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (13:43 IST)

ప్రియురాలు దూరం పెడుతోందని కత్తితో పలుమార్లు పొడిచి దారుణ హత్య చేసిన యువకుడు

crime
కర్నాటకలో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే కాలేజీ క్యాంపస్‌లో అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు ఆమె మాజీ క్లాస్‌మేట్. హుబ్బళ్లిలోని బీవీబీ కాలేజీ (కేఎల్‌ఈ టెక్నలాజికల్ యూనివర్శిటీ)లో చదువుతున్న యువతి నేహా హిరేమత్ మెడ, పొట్ట, శరీరంలోని ఇతర భాగాలపై నిందితుడు ఫయాజ్ కత్తితో పలుమార్లు పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన క్యాంపస్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దురదృష్టవశాత్తు నేహాను కత్తితో నిందితుడు పొడుస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆమె మొదటి సెమిస్టర్ ఎంసీఏ పరీక్షలు ముగించుకుని తిరిగి వస్తుండగా సాయంత్రం 4:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
 
కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులు ఆమెను హుబ్బళ్లిలోని కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నేహా హుబ్బల్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు నిరంజనయ్య హిరేమఠ్ కుమార్తె. ఫయాజ్ బెలగావి జిల్లాలోని సవదత్తి తాలూకా నివాసి. పోలీసులు తెలిపిన సమచారం ప్రకారం, నిందితుడు- బాధితురాలు ఇద్దరూ BCAలో క్లాస్‌మేట్స్- స్నేహితులు. కాలేజీ యాజమాన్యం, నేహా తల్లిదండ్రులు వారి స్నేహాన్ని వ్యతిరేకించడంతో, ఆమె ఫయాజ్‌కు దూరం కావడం ప్రారంభించింది. దీంతో అతడు ఆమెపై కసి పెంచుకున్నాడు.
 
ఈ కారణంతోనే ఆమెను కత్తితో పొడిచి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఫయాజ్‌తో ప్రమాదం పొంచి వుందని నేహా తల్లిదండ్రులు ఆమెను కాలేజీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురువారం ఆమె ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయడానికి కాలేజీకి వచ్చింది. క్యాంపస్‌లో ఆమెను ఫయాజ్ అడ్డగించాడు. వాగ్వాదం చేసాడు. ఆమె అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆమెను కిందపడేసి చాలాసార్లు కత్తితో పొడిచాడు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.