మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2024 (12:03 IST)

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

suicide
కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ట్రిపుల్ ఐటీలో ప్రకాశం జిల్లా కంభం మండలం, జంగుంట్ల గ్రామానికి చెందిన కుర్రి రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది.
 
ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది సాయంతో ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, చివరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా పూర్తికావడంతో మరో పది రోజుల్లో ఇంటికి వెళ్లాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, హాటల్ వార్డెన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే, మృతురాలి మొబైల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.