1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (10:39 IST)

భార్యాపిలల్లకు విషం తాగించి... ఉరేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడ?

crime scene
అతనికి ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు.. భార్యాపిల్లలకు విషం తాగించి, తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణం నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదిలాబాద్‌కు చెందిన కొత్తకోట సూర్యప్రకాష్‌ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య అక్షయ, కుమార్తె ప్రత్యూష (13), కుమారుడు అద్వైత్ (7)లు ఉన్నాడు. 
 
సూర్యప్రకాష్ కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి నిజామాబాద్‌కు వచ్చి గత 15 రోజులుగా కపిల హోటల్ రూం నంబరు 101లో ఉంటున్నాడు. 
 
అయితే, ఆదివారం ఎంతసేపటికి వారు తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది కిటికీల్లోని చూడగా, నలుగురు విగతజీవులుగా కనిపించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సూర్య ప్రకాష్ ముందుగా భార్యాపిల్లకు విషమిచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరేసుకున్నట్టు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ పనికి పాల్పడ్డాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.