పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ఉన్నత చదువులు చదువుకోవాలన్న తన మాట పెడచెవిన పెట్టి తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు చూస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శృతి (20)గా గుర్తించారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర నర్సయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కుమార్తె శ్రుతి(20) జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్లో ఉన్న బీసీ వసతి గృహంలో ఉంటూ స్థానిక ఎన్జీ కళాశాలలో డిగ్రీ చివరి ఏడాది చదువుతుంది. పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుండటంతో పైచదువులు చదువుతానని చెప్పింది.
ఈ విషయం మాట్లాడడానికి బుధవారం ఇంటికి రావాలని తల్లిదండ్రులు చెప్పడంతో చదువు ఆగిపోతుందని మనస్తాపం చెంది వసతి గృహంలోని శౌచాలయంలో ఉరి వేసుకుని మంగళవారం చనిపోయింది. ఎంతసేపటికి బయటకు రాక పోవడంతో తోటి విద్యార్థుల సమాచారంతో మృతదేహం బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.