1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

పెళ్లికి నిరాకరించిందనీ యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

knife
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో ప్రేమోన్మాది తాను ప్రేమించిన యువతి గొంతు కోశాడు. దీంతో బాధితురాలు పది గంటల పాటు నరక యాతన అనుభవించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని మోపాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19), మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
కొద్ది రోజులుగా ఆమెపై అనుమానం పెంచుకున్న సంజయ్‌.. తరచూ కొడుతుండటంతో అతన్ని దూరం పెట్టింది. అయితే, ఈ నెల 14న తన పుట్టినరోజు ఉందని.. కనీసం ఈ వేడుకలకైనా రావాలని సంజయ్‌ యువతిని ఒప్పించి బయటకు తీసుకెళ్లాడు. 
 
రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కులాస్‌పూర్‌ మీదుగా చిన్నాపూర్‌ శివారుకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో కోపంతో గొంతు నులిమాడు. ఆ యువతి స్పృహ కోల్పోయిన అనంతరం గాజు సీసాతో గొంతు కోసి పరారయ్యాడు.
 
ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కాపాడుకున్న తీరు కలచివేసింది. యువతి వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు చిరుజల్లుల్లో తడుస్తూ రోడ్డు పక్కనే పడిపోయి ఉంది. 
 
మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్తున్న వారు ఆమెను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.