1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (11:38 IST)

గుంటూరులో అదృశ్యమై విజయవాడలో శవమైన మహిళా టెక్కీ

గుంటూరులో అదృశ్యమైన ఓ మహిళా టెక్కీ విజయవాడలో విగతజీవిగా కనిపించింది. ఆదివారం ఇంటి బయటకు వెళ్లిన తనూజ అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... విజయవాడలో మృత్యువాతపడింది. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని నిర్ధారించారు. దీంతో టెక్కీ తనూజ మరణంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన తనూజ అనే యువతి టెక్కీగా పని చేస్తున్నారు. ఈమెకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మణికంఠతో వివాహమైంది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ ఆపై ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు తమకు తెలిచిన ప్రదేశాల్లో గాలించారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో సోమవారం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో తనూజ మృతదేహం విజయవాడ మాచర్ల రహదారిలో కనపించింది. 
 
దీంతో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయివుంటుందని తొలుత పోలీసులు భావించారు. కానీ, ఆమె శరీరంపై చిన్నపాటి గాయం లేదా రక్తపు మరక లేకపోవడంతో పోలీసులు హత్యగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.