మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (10:19 IST)

జగన్‌తో బీజేపీ దోస్తీ.. ఫలించిన గాలి జనార్ధన రెడ్డి రాయబారం..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతులు కలపనున్నారా? ఎన్డీయేతో కలిసిపోనున్నారా? అంటే జాతీయ మీడియా అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. వైకాపా ఛీప్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతులు కలపనున్నారా? ఎన్డీయేతో కలిసిపోనున్నారా? అంటే జాతీయ మీడియా అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. వైకాపా ఛీప్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపే సమయం ఆసన్నమైందని.. ఇందుకు సర్వం సిద్ధమైందని ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు ఆర్ణాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. 
 
2019 ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే.. కేంద్రం స్థిరంగా నాటుకుపోయిన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించిందని కూడా ఆ టీవీ కథనంలో ఉటంకించింది. జగన్‌‌ను బీజేపీలోని ముగ్గురు కీలక నాయకుల వద్దకు గాలి తీసుకెళ్లారని.. ఆ చర్చలు కాస్త ఫలించాయని ఆ టీవీ పేర్కొంది. జగన్ ఎన్డీయేలో చేరుతానంటే బీజేపీ వద్దనదని, జగన్ చేరికకు బీజేపీ కూడా పచ్చజెండా ఊపిందని సదరు ఛానల్ వెల్లడించింది. 
 
ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ బేషరతుగా మద్దతిచ్చిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఎన్డీయేతో దోస్తీ చేస్తున్నారని.. ఈ దోస్తీకి త్వరలోనే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టేయాలని బీజేపీ నేతలు సైతం రెడీ అవుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై కిమ్మనకుండా ఉంటున్నారని రిపబ్లిక్ టీవీ తన కథనంలో పేర్కొంది. 2019 ఎన్నికల నాటికి జగన్‌తో దోస్తీకి బీజేపీ నోరెత్తే ఛాన్సుందని.. జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకున్నట్లు సమాచారం. 
 
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే వారితోనే ఏపీలో కలిసి వెళ్తామని ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇందుకు కీలకం మారాయి. తమది పక్కా రాజకీయ పార్టీ అని, చంద్రబాబుతో లాభం ఉందనుకుంటే ఆయనతో కలిసి వెళ్తామని, లేదంటే మరో నిర్ణయం తీసుకుంటామనే అర్థం వచ్చేలా బీజేపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను రిపబ్లిక్ టీవీ తన కథనంలో హైలైట్ చేసింది. అదే గనక జరిగితే ఏపీ సీఎం చంద్రబాబును బీజేపీ పక్కనబెట్టి.. జగన్‌ చేతులు పట్టుకుని 2019 ఎన్నికలకు పోయే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు అంటున్నారు.