మంగళవారం, 19 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:21 IST)

డిసెంబరు 1 వరకూ తుంగభద్ర పుష్కరాలు, సీఎం జగన్ పూజలు, ఏ నదికి ఎప్పుడు?

తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశించడంతో పుణ్యఘడియలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కర్నూలులోని ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలు ప్రారంభించారు. కరోనావైరస్ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ పుష్కర స్నానాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేయవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోనూ పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసారు. ఐతే నదిలో పుష్కర స్నానాలకు ప్రభుత్వ అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన ఈ పుష్కరాలు డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరుగనున్నాయి.
ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు?
ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని, 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27, తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి.
 
ప్రతి సంవత్సరం గురువు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు.. అంటే గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభరాశిలో ప్రవేశించినప్పుడు నర్మదానదికి, మిథునరాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథీ నదికి, ధనూరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరవాహిని (తపతి) నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధూనదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి.
ఇలా గంగా, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది. పుష్కర సమయంలో ఆ నదిలో సకల దేవతలు కొలువై వుంటారు. అందుకే ఆ సమయంలో నదిని చేరుకోవడం వల్ల ఆ దేవతలందరిని పూజించినట్లవుతుందని భక్తుల విశ్వాసం.