గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (15:22 IST)

వైద్య చరిత్రలోనే మరో అద్భుతం.. ఒక్క మందు బిళ్లతో క్యాన్సర్ ఖతం!

cancer
వైద్య చరిత్రలోనే మరో అద్భుతం జరిగింది. క్యాన్సర్ రోగులకు ఇది శుభవార్తగా మారింది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి డ్రగ్‌ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది.
 
పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఆర్నెళ్ల పాటు చేసిన క్లినికల్ ట్రయల్స్‌ సక్సెస్‌ కావడంతో.. ఒక్క మందు బిళ్లతో ఓ రకం క్యాన్సర్‌ పూర్తిగా అంతం కానుంది.
 
క్యాన్సర్‌ సోకిందంటే.. జీవితాన్ని కొద్ది రోజులుగా పొడిగించుకోవాలే తప్ప.. ఎన్నాళ్లు బతుకుతామో గ్యారంటీ ఇవ్వలేని రోగం ఇది. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. ఒకవేళ కోలుకున్నా.. జీవితాంతం వెంటాడే క్యాన్సర్‌ సమస్యలు.. బతకనీయకుండా చేస్తాయి. క్యాన్సర్ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది.
 
ఈ వ్యాధికి అమెరికా సైంటిస్టులు చేసిన క్లినికల్ ట్రయల్స్.. క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో తగ్గించవచ్చన్న భరోసా కల్పిస్తున్నాయి. ఒక్క మందు బిళ్లతో పెద్ద పేగు క్యాన్సర్‌ మటుమాయమవడం.. వైద్య శాస్త్రాన్నే నివ్వెరపరుస్తోంది. క్యాన్సర్‌ రోగులకు బతకాలన్న ఆశ.. జీవించాలన్న కోరికను రెట్టింపు చేస్తోంది.
 
న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన ఓ డ్రగ్ ట్రయల్స్.. క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై చేసిన క్లినికల్ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్‌ అయ్యాయి. ఆర్నెళ్లలోనే క్యాన్సర్‌ను ఖతం చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు సైంటిస్టులు.
 
పెద్ద పేగు కాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. ఈ డ్రగ్ ప్రయోగాలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టడంతో పాటు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
రోగులందరికీ.. ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇవ్వగా.. ట్రయల్స్ ముగిసేసరికి వారిందరిలో క్యాన్సర్ కణజాలం కనిపించకుండా మాయమైందని ప్రకటించారు సైంటిస్టులు. క్యాన్సర్‌కు ఎలాంటి చికిత్సలు అవసరం లేని రీతిలో వారంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ప్రకటించారు.