1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (11:54 IST)

భారత్‌లో కరోనా విలయం : సరిహద్దులను మూసివేసిన బంగ్లాదేశ్

భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తమ దేశ సరిహద్దులను మూసివేసింది. తద్వారా భారత్ నుంచి ఎలాంటి రాకపోకలు లేకుండా చేసింది. 
 
ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే విమాన రాకపోకలను నిలిపివేసిన బంగ్లాదేశ్.. తాజాగా భూ మార్గాన్ని కూడా మూసేస్తున్నట్టు ప్రకటించింది. 
 
భారత్‌తో ఉన్న భూ సరిహద్దును రెండు వారాలపాటు మూసేస్తున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ ఆదివారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26 (ఈ రోజు) నుంచే ఈ ఆదేశాలు అమలు రానున్నట్టు వెల్లడించారు. అయితే సరకు రవాణా వాహనాలను మాత్రం తమ దేశంలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. మల్దీవులకు చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ కూడా సోమవారం కీలక ప్రకటన చేసింది. ‘భారతదేశం నుంచి మాల్దీవులకు వచ్చే పర్యాటకులు జనావాస ద్వీపాల్లోని పర్యటక కేంద్రాల్లో ఉండటాన్ని నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి’  అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.