శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:17 IST)

పాక్‌ని ప్రపంచ దేశాలకి శత్రు దేశంగా మార్చేసారంటున్న జూనియర్ భుట్టో

పాక్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ఆరోపిస్తూ పాకిస్థాన్‌ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో విరుచుకుపడ్డారు. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన ఆయన ఉగ్ర సంస్థలకు పాక్‌లో స్థానం ఉండబోదని ఇమ్రాన్‌ అన్న వ్యాఖ్యలపై స్పందించారు.
 
‘పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్‌ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా జరుగుతోంది. ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. భారత్-పాక్‌ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్‌) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 
 
మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయితీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. ‘పార్లమెంట్ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీని నియమించండి’, ‘నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి’, ‘ మీ మంత్రి వర్గంలో ఉంటూ నిషేధిత సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి’.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారు’ అని భుట్టో పేర్కొన్నారు.
 
మరి ఖాన్‌గారి రియాక్షన్ ఏమిటో కాస్త వేచి చూద్దాం.