శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (09:06 IST)

పదవిని వదిలేందుకు సుముఖంగా లేని ట్రంప్... వైట్‌హౌస్‌తో బైడెన్ సంప్రదింపులు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. ఈ మేరకు ఎన్నికల ఫలితాలు కూడా తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో ఆయన అధ్యక్ష భవనాన్ని వీడాల్సివుంది. కానీ, ట్రంప్ మాత్రం తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్... పదవితో పాటు... వైట్‌హౌస్‌ను వీడేందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. 
 
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన ఎలక్టోరల్ ఓట్లను సాధించిన డెమొక్రాట్ల నేత జో బైడెన్, వైట్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకూ ఓటమిని అంగీకరించని ట్రంప్ నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. బైడెన్, శ్వేతసౌథంలోకి వెళ్లేందుకు మరో 73 రోజుల గడువుంది. అయితే, ఇప్పటికే బైడెన్ వైట్‌హౌస్ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇందుకోసం 'బిల్డ్ బ్యాక్ బెటర్ డాట్ కామ్' పేరిట ఓ వెబ్ సైట్‌ను, 'ట్రాన్సిషన్ 46' పేరిట ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌ను ఆయన ప్రారంభించారు.
 
ఇదిలావుంటే, తాను ఓడిపోయినట్టు టీవీ చానెల్స్ కోడై కూస్తున్నప్పటికీ.. ట్రంప్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. శనివారం నాడు ఎక్కడైతే గోల్ఫ్ ఆడుతూ గడిపారో, ఆదివారం కూడా అక్కడే రోజంతా ఉన్నారు. బైడెన్‌కు మెజారిటీకి కావాల్సినన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని తెలుస్తున్నా, పదవిని వదిలేందుకు ట్రంప్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపిస్తూ మరోమారు తనలోని అక్కసును వెళ్లగక్కారు. అంతేకాకుండా, ఈ వారంలో ఆయన పలు కోర్టుల్లో ఎన్నికల కౌంటింగ్ ను సవాలు చేస్తూ, కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ట్రంప్ తరపు లాయర్ రూడీ గిలియానీ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌లో పలు అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రూడీ వ్యాఖ్యానించడం గమనార్హం.