1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (11:31 IST)

ఎస్... నిజమే.. లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాం : నవాజ్ షరీఫ్

nawaz sharif
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 1999లో భారత్‌తో చేసుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించినట్టు వెల్లడించారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమని ఆయన ఆరోపించారు. 
 
పాకిస్థాన్ తొలి అణు ప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ 1999 నాటి లాహోర్ డిక్లరేషన్ గురించి ప్రస్తావించారు. '1998 మే 28వ తేదీన పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలను నిర్వహించింది. 
 
ఆ తర్వాత వాజ్‌పేయి ఇక్కడికొచ్చి మనతో ఒప్పందం (లాహోర్ డిక్లరేషన్ ) కుదుర్చుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పే' అని ఆయన వ్యాఖ్యానించారు.
 
లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య 1999లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని లాహోర్ డిక్లరేషన్ అని అంటారు. 
ఇందులో భాగంగా ఇరు దేశాలు.. శాంతి నెలకొల్పాలని, ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించాలని నిర్ణయించారు.

ఆ తర్వాత కొద్ది నెలలకే నవాజ్ షరీఫ్ జమ్మూకాశ్మీర్‌లో కార్గిల్ జిల్లాలో చొరబాట్లకు తెరతీశారు. ఫలితంగా జరిగిన యుద్ధంలో పాక్ ఓటమి చవి చూసింది.
 
అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్థాన్‌కు 5 బిలియన్ల ఆర్థిక సాయం ఇస్తానని ఆశ చూపినట్టు నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. 
 
తన స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ఉండి ఉండే బిల్ క్లింటన్ ప్రతిపాదనకు అంగీకరించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. తనను గద్దె దించేందుకు దేశ నిఘా సంస్థ కుట్ర పన్ని తప్పుడు కేసు బనాయించి విజయవంతమైందన్నారు.