1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (08:32 IST)

నేపాల్ ప్రధాని కేజీ శర్మ ఓలిపై బహిష్కరణ వేటు!

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిపై బహిష్కరణ వేటు పడింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్.సి.పి) సంచలన నిర్ణయం తీసుకుని ఓలిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ఠ ఆదివారం ప్రకటించారు. 
 
గత నెల 20న పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఓలి.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయంతో పుష్పకమల్ దహల్, ఓలి వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ప్రధాని నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దహల్ వర్గం ఆదివారం సమావేశమైంది. 
 
అనంతరం ఓలిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓలి ప్రత్యర్థి వర్గ నేత మాధవ్ కుమార్ నేపాల్ మాట్లాడుతూ.. అధికార ఎన్‌సీపీ ఛైర్మన్ పదవి నుంచి ఓలిని తొలగించినట్టు చెప్పారు.
 
ఆయనిక పార్టీలో సభ్యుడు కాదు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని తన తప్పును తెలుసుకుని సరిదిద్దినా ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాగా, రెండుగా చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తి హక్కు తమకే ఉంటుందని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
 
కాగా, కేపీ శర్మ ఓలి ఇటీవలి కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు కూడా. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనాతో కలిసి నేపాల్ దేశ సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నించారు. ఇందులోభాగంగా, నేపాల్ సరికొత్త మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను నేపాల్‌కు సొంతమైనవిగా ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెల్సిందే.