శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:03 IST)

గల్వాన్ లోయలో ఘర్షణ.. 60 మంది చైనా సైనికుల మృతి.. అమెరికా మీడియా

భారత్-చైనాల మధ్య గల్వాన్ లోయలో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 60మంది చైనా సైనికులు మరణించారని అమెరికాకు చెందిన వార్తా పత్రిక న్యూస్‌ వీక్‌ తన సెప్టెంబర్‌ 11 నాటి సంచికలో ఈ సంచలన విషయాలను ప్రచురించింది. పీఎల్‌ఏ తోకముడుస్తుందని చైనా ఏనాడూ భావించలేదని, దుందుడుకుగా వ్యవహరించే జిన్‌పింగ్‌కు ఇది పెద్ద అపజయంగా భావించాలని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
 
న్యూస్‌ వీక్‌ పత్రిక కథనం ప్రకారం.. భారత సరిహద్దులో చైనా సైన్యం విఫలమైంది. ఈ వైఫల్యం తరువాత సైన్యంలో విధేయులను నియమించుకోవాలని చైనా సైన్యం జిన్‌పింగ్‌కు సూచించింది. అతి పెద్ద విషయం ఏమిటంటే, వైఫల్యం కారణంగా పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్, పిఎల్‌ఏ నాయకుడు కూడా అయిన జిన్‌పింగ్.. భారత సైనికులపై వీలైనంత త్వరగా మరో దూకుడు చర్య తీసుకోవాలని ప్రోత్సహించారు. 
 
ఈ కథనంలో చైనాకు చెందిన ఎంత మంది సైనికులు చనిపోయింది వెల్లడించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి తప్పిదమే అని తెలిపింది. గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించింది. చైనా పీఎల్‌ఏ ఎందుకు వెల్లడించలేదు అని ప్రశ్నించింది. ఆనాటి ఘర్షణలో చైనాకు చెందిన దాదాపు 60 మంది మరణించారని కథనంలో వెల్లడించారు. మరెందరో గాయపడ్డారని కూడా కథనం తెలిపింది.
 
గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏళ్ల తరువాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణ ఇదే. ఈ ఏడాది ఆగస్టు నెల చివరలో 50 సంవత్సరాలలో మొదటిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించింది. చైనా స్వాధీనం చేసుకున్న అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలను భారతదేశం తిరిగి తన వశం చేసుకుంది. ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలను భారత జవాన్లు అడ్డుకోవడంతో చైనా సైన్యం షాక్‌కు గురైంది.
 
ఆశ్చర్యపోయిన చైనా సైనికులు వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. చొరబాటుదారులకు భారత్‌ అవకాశం ఇవ్వడం లేదని న్యూస్‌ వీక్‌ తన కథనంలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.