1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (09:51 IST)

నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా మరోసారి ప్రచండ .. నేడు ప్రమాణ స్వీకారం

prachanda
నేపాల్ ప్రధానమంత్రిగా పుష్ప కమాల్ దహాల్ ప్రచండ నియమితులయ్యారు. మొత్తం 275 మంది సభ్యులున్న సభలో ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు ప్రచండకు అనుకూలంగా 165 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో ఆయన సోమవారం సాయంత్రం 4 గంటలకు నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఈ హిమాలయా దేశానికి ప్రధానిగా ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 
 
సీపీఎన్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను నేపాల్ దేశ కొత్త ప్రధానిగా ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆదివారం నియమించారు. నేపాల్ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76, క్లాజ్ 2 ప్రకారం ప్రచండను దేశ ప్రధానిగా నియమించినట్టు అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, సీపీఎన్ యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలీ, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్ లింగ్డెన్ తదితరులు ప్రపంచడను ప్రధానిగా నియమించాలని కోరుతూ బిద్యాదేవికి ఓ వినతి పత్రాన్ని అందించారు. వీటిన్నింటినీ పరిశీలించిన అధ్యక్షురాలు తన నిర్ణయాన్ని వెల్లడించారు. 
 
మరోవైపు, 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో 165 మంది ప్రచండతు మద్దతు తెలిపారు. వీరిలో సీపీఎల్ యూఎంఎల్‌కు చెందిన 78 మంది, సీపీఎన్ యంసీకి చెందిన 32 మంది, ఆర్ఎస్పీకి చెందిన 20 మంది, ఆర్పీపీకి చెందిన 14 మంది, జేఎస్పీకి చెందిన 12 మంది జనమత్‌కు చెందిన ఆరుగురు, నాగరిక్ ఉన్ముక్తి పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు.